టాలీవుడ్ మాస్ డైరెక్టర్స్ లిస్ట్ లో రాజమౌళి (Rajamouli) వినాయక్ (VV Vinayak) ల తరువాత బోయపాటి శ్రీను (Boyapati Srinu) కూడా ఉంటారు అనడంలో సందేహం లేదు. ఆయనలా మాస్ మసాలా సినిమాలు ఎవ్వరూ తీయలేరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి హీరోనైనా పవర్ఫుల్గా మార్చేస్తారు బోయపాటి. ‘భద్ర’ ‘తులసి’ వంటి హిట్లతో పాటు ‘సింహా’ ‘లెజెండ్’ ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్లు కూడా ఈయన ఖాతాలో ఉన్నాయి.
కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ను సైతం ‘జయ జానకి నాయక’ సినిమాతో పవర్ఫుల్గా చూపించి తన మార్క్ను చాటుకున్నారు. కిందటేడాది ‘వినయ విధేయ రామ’తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఇప్పుడు బాలకృష్ణతో ముచ్చటగా మూడోసారి జతకట్టి మరో బ్లాక్ బస్టర్పై కన్నేశారు. ఈయనతో ఏ హీరో వర్క్ చేసినా.. వాళ్ళ ఫ్యాన్స్ కు బోలెడన్ని మాస్ ఎలిమెంట్స్ ను పంచుతుంటాడు బోయపాటి శ్రీను. ఓ విషయంలో రాజమౌళికి కూడా సాధ్యం కాని రికార్డు బోయపాటి సొంతం చేసుకున్నాడట.
బోయపాటి సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు హిందీలోనూ ఫ్యాన్స్ ఉన్నారని ఇప్పుడు స్పష్టమైంది. ఆయన రెండు సూపర్ హిట్ మూవీస్ ‘సరైనోడు’, ‘జయ జానకి నాయక’ హిందీ డబ్బింగ్ వర్షన్లు యూట్యూబ్లో ఒక్కోటి 30 కోట్ల (300 మిలియన్) వ్యూస్ సాధించాయి. ఒకే దర్శకుడు రూపొందించిన రెండు సినిమాలు యూట్యూబ్లో 300 మిలియన్ వ్యూస్ సాధించడం ఇదే తొలిసారి. నిజానికి అల్లు అర్జున్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్లకు యూట్యూబ్లో మంచి ఆదరణ లభిస్తోంది. ‘సరైనోడు’ సినిమా ఇప్పటికే 300 మిలియన్ వ్యూస్ సాధించగా.. తాజాగా ‘జయ జానకి నాయక’ ఈ మార్క్ను అందుకుంది. బోయపాటి శ్రీను సినిమాలకే ఇలా జరగడం విశేషం.