వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘దిశ ఎన్ కౌంటర్’ చిత్రాన్ని నిలిపి వేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టు ను ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ కుమార్తె కథతో సినిమా తీయడమే కాకుండా తమను క్షోభకు గురిచేస్తున్నారని దిశ తండ్రి కోర్టుకెక్కారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని కృష్ణ మూర్తి అన్నారు. ఈ సినిమా విడుదలను ఆపాలని పిటిషన్లో కోరారు. దీనిపై కేంద్ర సెన్సార్ బోర్డును తెలంగాణ హైకోర్టు వివరణ కూడా కోరింది.
ఇదిలా ఉంటే ‘దిశ ఎన్కౌంటర్’ చిత్రాన్ని నిలిపి వేయాలని ఎన్కౌంటర్లో మరణించిన నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మంగళవారం వాదనలను విన్నది. ఎన్కౌంటర్కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణమూర్తి హైకోర్టు తెలిపారు. దిశ సంఘటన పై ఒక పక్క జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుగుతుంటే ఎలా చిత్రం తీస్తారని కృష్ణమూర్తి కోర్టు కు తెలిపారు.
అంతేకాకుండా, ఈ చిత్రంలో నిందితులను దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కృష్ణమూర్తి కోర్టును కోరారు. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రాం గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ లకు హైకోర్టు షోకాజు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.