ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మాటల యుద్ధానికి తెరలేచినట్టే కనిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని.. అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ను ప్రకాష్ రాజ్ ఊసరవెల్లితో పోల్చారు.
అయితే పవన్ ని ఏదైనా అంటే ఒంటి కాలిపై లేచొచ్చే సోదరుడు నాగబాబు ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మీకు భాజపా నచ్చకపోతే విమర్శించండి.. అంటూనే ఆ పార్టీ చేసే మంచిని కూడా హర్షించగలిగే మనసు మీకు లేదు.. నీ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లోనే అర్థం అయ్యింది. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో.. డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. అంటూ కౌంటర్ ఇచ్చారు. మీడియా అడిగిందని ఒళ్లు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయటవేసుకోకు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు సత్తా చాటబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే, నాగబాబు వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ కౌంటర్ ఇచ్చారు. మాకు తెలుగు వచ్చు.. కానీ మీ భాష రాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘గౌరవనీయులైన నాగబాబు గారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు.’’ అని ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ట్వీట్కు జనసైనికులు యథావిధిగా విమర్శలు సంధిస్తున్నారు. మరి దీనిపై మెగా బ్రదర్ స్పదిస్తారా లేదా సైలెంటుగా ఉంటారా అనేది చూడాలి.