ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో చేసే రోల్ ఎంత చిన్నదైనా కూడా ఆ మూవీకి సూపర్ రెస్పాన్స్ దక్కుతుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్స్టార్ పవన్కల్యాణ్ ముఖానికి రంగులద్దుకుని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
సుదీర్ఘ విరామం అనంతరం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీ చేస్తున్న పవర్ స్టార్.. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి, సాగర్ కే చంద్ర, హరీశ్ శంకర్ లాంటి దర్శకులతో సినిమాలు చేయనున్నారు. మరోవైపు, ‘సరిలేరు నీకెవ్వరు’తో ఈ ఏడాది ఆరంభంలోనే బ్లాక్బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సూపర్స్టార్ మహేశ్బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ పరశురామ్ తన ‘సర్కారు వారి పాట’ మూవీ ఓ ఇంపార్టెంట్ రోల్ చేయాల్సిందిగా పవన్ని కోరడంతో వెంటనే ఓకే చెప్పారట.
మహేశ్బాబు-పవన్కల్యాణ్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారంటూ నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో మహేశ్ బాబుతో పాటు మరో స్పెషల్ క్యారెక్టర్ ఉందట. కేవలం 5 నిమిషాలే ఉండే ఈ రోల్ కథను మలుపు తిప్పేలా ఉంటుందని, అందుకే ఈ రోల్ పవన్తో చేయించి సినిమాకే మేజర్ అట్రాక్షన్ చేయాలని భావించిన పరశురామ్.. ఆయన వద్ద గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని సమాచారం.
ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ‘సర్కారు వారి పాట’ మూవీ రెగ్యూలర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి మహేశ్ ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. సదరు వార్తలు చూసిన ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నాటి తమ కల నిజమైతే బాగుండని అనుకుంటున్నారు.