Mahesh Babu – Mani Ratnam : మణిరత్నం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో సినిమాలు చేయాలని హీరోలందరూ ఆశపడుతుంటారు. కమర్షియల్ విలువలు ఉండవనో, బాక్సాఫీసు సూత్రాల్ని ఆయన పట్టించుకోరనో తెలీదు గానీ, తెలుగు హీరోలు మణిరత్నం తో సినిమా అంటే వెనకడుగు వేస్తారు. ఇన్నేళ్ల కెరీర్ లో మణిరత్నం తెలుగులో నేరుగా తీసిన సినిమా.. `గీతాంజలి` మాత్రమే.
అయితే ఈ మధ్యకాలంలో మణిరత్నం (Mani Ratnam) ఓ కథ పట్టుకొని టాలీవుడ్ స్టార్ హీరోల చుట్టూ తిరిగారు. కానీ మనవాళ్లు మాత్రం ముందుకు రాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుని(Mahesh Babu) కలిశారు మణిరత్నం. వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అది నిజమే అని మణిరత్నం ధృవీకరించారు.
తాజాగా ఈ వార్తలపై స్పందించారు మణిరత్నం. మహేష్ ని కలిసిన మాట నిజమేనని.. ఆయనతో సినిమా కూడా చేయాలనుకున్నానని మణిరత్నం చెప్పారు. ఆయనతో కథా చర్చలు జరిగాయని.. కానీ కుదరలేదని అన్నారు. భవిష్యత్తులో మంచి కథ దొరికితే మహేష్ తో సినిమా చేస్తానని చెప్పారు.
నాగచైతన్య, రామ్… ఇలాంటి యంగ్ హీరోలతోనూ మణి టచ్లోకి వెళ్లారు. కానీ వాళ్లు కూడా `నో` చెప్పేశారు. ప్రస్తుతం `నవరస` అనే ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించారు మణిరత్నం. దీనికి మణిరత్నం నిర్మాత మాత్రమే. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.