విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పూటకో మాట మార్చే ఊసరవల్లి అని వ్యాఖ్యానించారు. అభిమానులు కార్యకర్తలకు బీజేపీకి ఓటేయ్యాలని చెబితే ఇక జనసేన పార్టీ ఎందుకని ప్రశ్నించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
జాతి హితం కోసం బీజేపీకి మద్దతు అంటే.. ఇక జనసేన పార్టీ ఎందుకని.. ఇంకొకరి భుజాన ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు అని ప్రకాష్ రాజ్ కడిగిపారేశారు.. బీజేపీ వాళ్లు దారుణంగా మాట్లాడుతున్నారని.. హైదరాబాద్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని విమర్శించారు. అభిమానులకు బీజేపీకి సపోర్ట్ చేద్దాం అంటున్నారు.. అంటే లీడర్ నేను కాదు.. ఆయన అని పవన్ అంటున్నట్లు! మీరు బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే.. ఇక, జనసేన ఎందుకు? ఇంకొకరి భుజాన ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు?
ప్రకాష్రాజ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘పవన్ కళ్యాణ్కు ఏమైందో నిజంగా నాకు అర్థం కావట్లేదు. పవన్ నిర్ణయాలపై చాలా డిసప్పాయింట్ అయ్యాను. నువ్వొక లీడర్.. మీకొక పార్టీ ఉంది.. మళ్లీ ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి? ఏపీలో గాని, ఇంకో చోట గాని.. జనసేన ఓట్ షేర్ ఎంత.. బీజేపీ ఓటు షేర్ ఏంటి? 2014లో మీరే బీజేపీ వాళ్లు అద్భుతం, ఇంద్రుడు, చంద్రుడు అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు, వాళ్లు ద్రోహులు అన్నారు! మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారు అంటున్నారు. అంటే ఇలా మూడు నాలుగు సార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కదా..’ అని విమర్శించారు.
‘పవన్ మీరు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. 2019లో కమ్యూనిస్టులకు మద్దతు నిచ్చారు.. ఇప్పుడు జీహెచ్ఎంపీ ఎన్నికల్లో ఏకంగా పోటీ నుంచి తప్పుకున్నారు..ఇలా ఓ లీడర్ తీసుకునే నిర్ణయం కాదు’అని విమర్శించారు. తెలంగాణ ప్రజలరా.. తస్మాత్ జాగ్రత్త! గతంలో ఇలా వచ్చిన వారికి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. వీళ్లకే కాక, వీళ్ల వెంట వెళ్లిన మన వారికి కూడా బుద్ధి చెప్పాలి.’’ అయితే చివరి నిమిషంలో తమ పార్టీ ఎక్కడా పోటీ చేయలేదని ప్రకటించడంతో నలవువైపులా పవన్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు.