Sravani suicide case: శ్రావణి ఆత్మహత్య కేసులో మరో నిందితుడు, నిర్మాత అశోక్ రెడ్డి (Ashok Reddy) అరెస్ట్ అయ్యారు. ఆయన్ని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మనసు మమత సీరియల్ నటి కొండపల్లి శ్రావణి (actress sravani) ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్లో నివసిస్తున్న శ్రావణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఆమెను మానసికంగా వేధించి ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు నిందితులు దేవరాజ్, సాయి క్రిష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు.
సోమవారం ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం వస్తానని చెప్పి చివరి నిమిషంలో అశోక్ రెడ్డి మస్కా కొట్టారు. సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో అశోక్ రెడ్డి సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దేవరాజ్కు శ్రావణి దగ్గర కావటాన్ని అశోక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని పోలీసులు తెలిపారు. సాయికృష్ణా రెడ్డి ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది.
ఏసీపీ తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం నిందితుడిని ఎస్సార్ నగర్ పీహెచ్సీకి తరలించారు. ఆ పరీక్షల అనంతరం అశోక్రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్రాజ్ రెడ్డి, ఏ3 సాయికృష్ణారెడ్డిలు పోలీసుల రిమాండ్లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.ఈ కేసులో అశోక్ రెడ్డి అరెస్టు కావడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.