సినిమాల కోసం ఎదురుచూసేవారికి ఇది చల్లని కబురే. సాయిధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా రూపొందిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ డిసెంబరు 25న థియేటర్లలో విడుదలకాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వం వహించారు. ఈ విడుదల తేదీని అధికారికంగా శనివారం ప్రకటించారు.
ఈ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ.. ‘‘ఇన్ని రోజులు మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి మేం సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా క్రిస్మస్కు మిమ్మల్ని నవ్వించడానికి వస్తున్నాం. అన్ని ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా డిసెంబర్ 25న మీ ముందుకు వస్తోంది’’ అని అన్నారు.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. మా సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాం’’ అని చెప్పారు. అయితే, తెలంగాణలో థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా జీవో జారీ చేయలేదు. మరోవైపు, థియేటర్లు సినిమా విడుదల చేస్తూ రిలీజ్ డేట్ను ప్రకటించిన తొలి చిత్రం ఇదే. మొత్తం మీద సాయి తేజ్ ‘సోలో’గా వచ్చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్.