సమాజంలో మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మహిళామణులకు అండగా నిలుస్తూ వారి తరపున తన ట్విట్టర్ వేదికలో బలమైన గొంతు వినిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు పురుషపుంగవుల వికృత చేష్ఠలను ట్వీట్ వేదికగా ప్రశ్నించారు. ముఖ్యంగా హాస్టళ్లల్లో ఉండే అమ్మాయిలపై వార్డెన్లు పాల్పడే అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల గుజరాత్లోని ఓ హాస్టల్ వార్డెన్ అమ్మాయిల పట్ల వికృత చర్యలకు పాల్పడిన ఘటన మరువక ముందే హైదరాబాద్లోనూ అలాంటి ఘటనే జరిగిందంటూ సింగర్ చిన్మయ్ బయటపెట్టింది.
మీటూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న చిన్మయి వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్మీడియా ద్వారా బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ తరహాలోనే సేమ్ టు సేమ్ వికృత వార్డెన్ మన హైదరాబాద్ లోను ఉన్నారన్న విషయం బయటపడింది చిన్మయి ట్వీట్ తో. ఓ పదో తరగతి అమ్మాయిని లేడీ వార్డెన్ వేధించిన తీరు ప్రముఖంగా చర్చకు వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం ‘నేను 2015లో పదో తరగతి చదివేదాన్ని. హైదరాబాద్లోని ఓ స్కూల్లో చదువుకుంటూ అక్కడే హాస్టల్లో ఉండేదాన్ని. అక్కడ వార్డెన్ అమ్మాయిలను చాలా ఇబ్బందులు పెట్టేది. పీరియడ్స్ వచ్చాయని చెబితే వెంటనే నమ్మేది కాదు. బట్టలు విప్పి చూపించమనేది.
అలాంటి పరిస్థితి నాకూ ఓ రోజు వచ్చింది. క్లాసులో ఉండగా నాకు పీరియడ్స్ వచ్చాయి. దీంతో టీచర్ పర్మిషన్ తీసుకుని హాస్టల్కి వెళ్లగా వార్డెన్ లోనికి అనుమతించలేదు. స్కూల్ టైమ్లో ఇక్కడికెందుకు వచ్చావంటూ తిట్టింది. పీరియడ్స్ వచ్చాయని చెప్పగా నమ్మలేదు. బట్టలు విప్పి చూపించమనడంతో అలాగే చేశాను. ఆ తర్వాతే నన్ను హాస్టల్లోకి అనుమతించింది. ఆనాటి ఘటన తలుచుకుంటే ఇప్పటికీ నాకు బాధేస్తుంటుంది’ అని చెప్పుకొచ్చింది. సంఘంలో ఇలాంటి చీడపురుగులున్నారు అంటూ చిన్మయి ఫైరవ్వడంతో అది కాస్తా ట్విట్టర్ లో వైరల్ గా మారుతోంది.